గెలిచామన్న ట్రంప్... అదో భ్రమేనన్న ఇరాన్

  • ఇరాన్ సైనిక శక్తిని నిర్మూలించామన్న అమెరికా
  • అవి కట్టుకథలంటూ కొట్టిపారేసిన ఇరాన్
  • ప్రస్తుత పరిస్థితిని వియత్నాం యుద్ధంతో పోలిక
  • ట్రంప్ ప్రకటనలు 'ఫైవ్ ఓ క్లాక్ ఫోల్లీస్' వంటివని ఎద్దేవా
పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దాదాపుగా నిర్మూలించామని, యుద్ధ లక్ష్యాలకు దగ్గరగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ మాటలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, అవి కేవలం భ్రమ మాత్రమేనని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా ఆయన అమెరికా తీరును వియత్నాం యుద్ధంతో పోల్చారు. 1960లలో వియత్నాంలో అమెరికా ఓడిపోతున్నప్పటికీ, తమ దేశం గెలుస్తోందంటూ నాటి జనరల్ వెస్ట్‌మోర్‌ల్యాండ్ ప్రజలను తప్పుదోవ పట్టించారని గుర్తుచేశారు. ఇప్పుడు ట్రంప్ చేస్తున్న ప్రకటనలు కూడా అలాంటివేనని ఆయన విమర్శించారు.

వియత్నాం యుద్ధ సమయంలో సైగాన్‌లో సైనిక అధికారులు రోజూ సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశాలు నిర్వహించి, యుద్ధంలో గెలుస్తున్నామంటూ కట్టుకథలు చెప్పేవారని, వాటిని మీడియా 'ఫైవ్ ఓ క్లాక్ పోలీస్' (సాయంత్రం 5 గంటల పిచ్చితనం) అని పిలిచేదని అరాక్చీ తెలిపారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కూడా అలాంటి 'ఫాంటసీ' కథలని ఆయన సెటైర్ వేశారు.

ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య తేడా ఉండటాన్ని 'క్రెడిబిలిటీ గ్యాప్' అంటారని, అమెరికా మరోసారి అదే తప్పు చేస్తోందని అరాక్చీ అన్నారు. ఇరాన్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామన్న అమెరికా వాదనల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన ఈ వ్యాఖ్యలతో స్పష్టం చేశారు.

Donald Trump
Iran
US Iran tensions
West Asia
Sayyed Abbas Araghchi
Vietnam War
Iran military
US foreign policy
Iran defense system

More Telugu News